అభివృద్ధి నిరోధకులకు బుద్ధి చెప్పే టైం వచ్చింది

అభివృద్ధి నిరోధకులకు బుద్ధి చెప్పే టైం వచ్చింది
  • ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్: అభివృద్ధి నిరోధకులకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైనదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బుధవారం బోనాల దేవాలయ కమిటీలకు బంజారాహిల్స్ లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాలులో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ తో కలసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ  సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు పండగ అని అన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి దేవాలయంలో బోనాలు ఘనంగా జరుపుకునే లక్ష్యంతో చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని అన్నారు.  అభివృద్ధి నిరోధకులే  దళితబంధు పథకాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే దళితబంధు తీసుకువచ్చారనడం సరికాదన్నారు. ఇది కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం చేస్తారని ప్రతి పక్షాలు విమర్శించడం సిగ్గుచేటన్నారు. కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం  తరహాలోనే దళితబంధు పథకం సైతం రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని చెబుతున్నా పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని దానం నాగేందర్ విమర్శించారు.